ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనవడిని కొట్టి చంపేశారు!

  • 35 ఏళ్ల హిమాన్షు సింగ్‌ను కర్రలతో కొట్టి చంపిన నిందితులు
  • శనివారం రాత్రి పంచాయతీకి వెళ్లిన హిమాన్షు
  •  అక్కడే ఆయనపై దాడిచేసిన నిందితులు
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేదార్‌సింగ్ మనవడిని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. మవు జిల్లాలోని కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పాత కక్షల నేపథ్యంలో 35 ఏళ్ల హిమాన్షు సింగ్‌ను మహువార్ గ్రామంలో శనివారం రాత్రి ఏడెనిమిది మంది కొట్టి చంపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు ఏఎస్పీ త్రిభువన్ నాథ్ త్రిపాఠీ తెలిపారు.  

హిమాన్షు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. హిమాన్షు తాత దివంగత కేదార్ సింగ్ 1980లో ఘోసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శనివారం రాత్రి కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైరో డోన్వార్ గ్రామంలో పంచాయతీకి హిమాన్షు వెళ్లారు. అక్కడ కొంతమంది వ్యక్తులతో ఆయనకు వాగ్వివాదం జరిగింది. దీంతో వారంతా కలిసి కర్రలతో ఆయనను చావబాదారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను మహువార్ గ్రామంలో పడేశారు. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Uttar Pradesh
Mau
Congress
Himanshu Singh

More Telugu News